13-06-2025 12:00:00 AM
మంత్రి తుమ్మలకు పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి
ముషీరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సంఘం (ఐఎన్టీయూసీ) నేతలు విజ్ఞప్తి చేశారు.
ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యరగాని నాగన్న గౌడ్ నేతృత్వంలో సంఘం అధ్యక్షులు ఎ. శ్రీనివాస గౌడ్, నాయకులు మోతె భాస్కర్రెడ్డి, కేతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గోపాల మల్లారెడ్డి, కడారీ వీరేశం, మోడెం సురేష్, పోచంపల్లి కృష్ణమూర్తి, చింతకాయల సురేష్, కొన్నె వెంకటయ్య, ఏడకులు సోమిరెడ్డి లు గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలసి వినతి పత్రం అందజేశారు.
గ్రామీణ ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందిస్తున్న పిఏసిఎస్ ఉద్యోగుల సమస్యలు దాదాపు 12 సంవత్సరాల నుండి పరిష్కరించకుండా ఉన్నాయని, పీఏసీఎస్ ఉద్యోగుల కు పెండింగ్ లోఉన్న పి.ఆర్.సి తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు.
ప్రతినెలా 5న డీసీసీబీ బ్యాంకు ద్వారా జీతభత్యాలు చెల్లించాలని, గ్రాట్యుటీ 2 లక్షల రూపాయలు కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిసిసిబి ఉద్యోగుల మాదిరిగా ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో చేర్చించి పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.