11-09-2024 12:40:51 AM
బీఆర్ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ ఇచ్చామంటూ రేవంత్ సర్కార్ బూటకపు మాటలు చెబుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇందుకు నాగర్కర్నూల్ జిల్లా పెంటవెల్లి రైతులకు జరిగిన అన్యాయమే సజీవ సాక్ష్యమన్నారు. మంగళవారం ఎక్స్ వేదిక ఆయన స్పందిస్తూ పెంటవెల్లిలో 499 మంది రైతుల్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడం మోసం కాకుండా మరేమటి ప్రశ్నించారు. ప్రభుత్వం విధించి ఆగస్టు 15 వరకు ఎందుకు రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలపై సైతం స్పందించిన కేటీఆర్.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని, పాఠశాలల్లో పారిశుద్ధ్యం చేసిందన్నారు. తాజాగా సిర్పూర్లోని సోషల్ వెల్పేర్ గురుకుల బాలుర హాస్టల్లో రెండు రోజుల వ్యవధిలో 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ నుంచి ఆసిఫాబాద్ వరకు విద్యార్థులంతా తీవ్ర నిర్లక్ష్యానికి గురైతుంటే సీఎం రేవంత్రెడ్డి మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. హైడ్రాపై స్పందిస్తూ రాష్ట్రంలో బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేయలేకే.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి పనులు చేస్తుందన్నారు.
ఓ చిన్నారికి తన పుస్తకాలు కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా బిల్డింగ్ను కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పేదవారిని గాలికి వదిలేశారని వాపోయారు.