రేవంత్లో డిప్రెషన్
- నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుపై దుష్ప్రచారం
- దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ డ్రామాలు
- రేవంత్ తెలంగాణకే సీఎం.. ఉత్తర భారతానికి కాదు
- కవిత పార్టీని స్వాగతిస్తున్నాం
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మార్చి 28 (విజయ క్రాంతి): నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం మహిళా రిజర్వేషన్లను కేంద్రం అమలు చేసేందుకు సిద్ధమవుతుండటం తో సీఎం రేవంత్రెడ్డిలో డిప్రెషన్ మొదలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అందు కే స్థాయిని మరిచి ప్రధానిపై దిగజారి మాట్లాడుతున్నారని, దక్షిణాదికి అన్యా యం జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచుతున్నప్పుడు దక్షిణాదికి ఏ విధంగా అన్యా యం జరుగుతుందని ప్రశ్నించారు. 6 గ్యా రంటీల అమలు చేయడం చేతగాక ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారంటూ విమర్శించారు. రేవంత్రెడ్డి తెలంగాణకు మాత్రమే సీఎం అని, ఉత్తరాది రాష్ట్రాలకు కాదని పేర్కొన్నారు. ప్రధా ని మోదీపై రేవంత్రెడ్డి తన స్థాయిని మరి చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సీఎం ఉపయోగిస్తున్న భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉన్నదన్నారు. ఇప్పటికైనా ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇస్తున్నదో తెలంగాణ ప్రలజకు తెలుసన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధి పైన, గ్యారంటీల అమలుపైన దృష్టి సారించాలని సూచించారు.
కాళేశ్వరం పాపం కేసీఆర్దే..
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపంలో వైఫల్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమ ని, ఆ పాపం మాజీ సీఎం కేసీఆర్దేనని బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు కేసీఆర్ అతిపెద్ద ఇంజనీర్లా వ్యవహరించాడని, ప్రాజెక్టును డిజైన్ చేసింది ఆయనేనని, ప్రాజెక్టు కుంగిపోవడానికి, ప్రజాధనం వృథా కావడానికి కూడా కేసీఆర్ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. అయినప్పటికీ కేసీఆర్ను, కాళేశ్వరం అవినీతిపరు లను రేవంత్రెడ్డి సర్కార్ అరెస్ట్ చేయడం లేదన్నారు. కేసీఆర్తో రేవంత్రెడ్డి కుమ్కక్కవడంవల్లే కేసీఆర్ కుటుంబంసహా బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
ప్రజాస్వామ్యయంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు..
ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉన్నదని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత పార్టీని స్వాగతిస్తు న్నామని తెలిపారు. ప్రజల కోసం, పేదల కోసం ఏ పార్టీ పనిచేసినా ఆ పార్టీకే మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కవిత పార్టీ కొత్త సమీకరణాలకు సంకేతంగా మారుతుందని చెప్పారు.




