14-06-2025 10:23:13 PM
రైతులకు జొన్నల డబ్బులు చెల్లించకపోతే ధర్నాలు చేపడతాం: సీపీఐ
బోథ్ (విజయక్రాంతి): ప్రభుత్వం కొనుగోలు చేసిన రైతుల జొన్న పంట డబ్బులను వెంటనే విడుదల చేయాలని బోథ్ సీపీఐ జిల్లా నాయకుడు గోవర్ధన్(CPI district leader Govardhan) డిమాండ్ చేశారు. మార్కుఫెడ్ ఆధ్వర్యంలోని సహకార సంఘాలకు జొన్నలు అమ్ముకుని నెలరోజులవుతున్న డబ్బులు రావడం లేదని విమర్శించారు. అటు పంట పెట్టుబడి లేక జొన్న పంట డబ్బులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడు రోజులలో డబ్బులు ఖాతాల్లో జమ చేయలేకపోతె ధర్నా చేపడతామని హెచ్చరించారు.
రుణమాఫీ ఇవ్వక, రైతుబంధు వేయక రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. రైతుల పేరు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం రైతులనే నట్టేట ముంచిందని రేవంత్ రెడ్డికి పాలించే అర్హత లేదని అన్నారు. వెంటనే జొన్నల డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బోథ్ కన్వీనర్ నరేష్, కార్తీక్. మున్షిప్. సంతోష్ పాల్గొన్నారు.