రాహుల్ భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి
ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పిటిషన్
న్యూ ఢిల్లీ, ఆగస్టు 16: లోక్సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాహుల్ గాంధీ 2003లో బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారని, లండన్లో బ్యాక్స్ఆప్స్ అనే కంపెనీని కూడా స్థాపించారని సుబ్రమణ్యస్వామి ఎక్స్లో పోస్టు చేశారు. ఆయన తన కంపెనీకి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు కూడా కడుతున్నారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.
దీనికి సంబంధించిన పత్రాలను కూడా ఆయన బయటపెట్టారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు దేశాల పౌరసత్వాలను కలిగి ఉండటం.. అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారత పౌరసత్వ చట్టం ను అతిక్రమించడమే అని అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం.. ఫారిన్ దేశాలకు సంబంధించి అక్కడి పౌరసత్వం కలిగి ఉన్న ఏ ఒక్క వ్యక్త్తి భారత దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండటానికి వీలులేదు. రాహుల్ గాంధీ ఇండియన్ సిటిజన్ షిప్ను రద్దు చేయడంలో కేంద్ర హోం శాఖ విఫలమైందని ఆసోసియేట్ అడ్వొకేట్ సత్య సబర్వాల్ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు.
వివరణ ఇవ్వండి..
2019 ఏప్రిల్ 29న కేంద్ర హోం శాఖ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో.. ‘మీరు ఏ దేశ పౌరసత్వం కలిగి ఉన్నారు? అని వివరణ కోరగా.. రాహుల్ రిప్లు ఇవ్వడానికి నిరాకరించారు. అదే ఏడాది మే నెలలో రాహుల్ గాంధీ భారత జనరల్ ఎలక్షన్స్లో పోటీచేయడానికి అనర్హుడని దాఖలైన పిటిషన్ను సుప్రీకోర్టు కొట్టివేసింది.




