22-06-2025 12:59:32 AM
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్టీసీలో గప్చుప్గా ఔట్ సోర్సింగ్ విధానం సాగుతుంది. 800 మంది కండక్టర్లు, వెయ్యి మంది డ్రైవర్ల ను ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రైవేటు ఏజెన్సీలు నియామకం చేసినట్లు స మాచారం. ఇంకా నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తూ, కార్మికులకు ద్రోహం చేయడమే నని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో 24న అన్ని కార్మిక సంఘాలు కలిసి ఏకైక జేఏసీగా ఏర్పడబోతున్నది. ఆ తర్వాత నూతన జేఏసీ ఈ అంశంపై పోరాటం చేస్తుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. దీనిపై ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించనున్నట్లు వారు చెప్పారు.
ఇది ప్రైవేటీకరణ కోసమే..
ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్, డ్రైవర్ పోస్టులను నియమించు కోవడాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధా నంతో నిరుద్యోగులను మోసగిస్తున్నా రని మండిపడుతున్నాయి. త్వరలో 3వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఔట్సోర్సింగ్ నియామకాలు చేయడమేంటని ఆర్టీసీ యూనియన్ నేతలు అంటున్నారు.
అంతా ఔట్ సోర్సింగ్ దిశగానే..
ఆర్టీసీ అంతా ఔట్ సోర్సింగ్ దిశలో పయనించేందుకు రంగం సిద్ధమవు తోందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్టీసీలో చివరి ఆర్టీసీ ఉద్యోగులు తామే అవుతామని వాపోతున్నారు. సెక్యూరిటీ గార్డులకు పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతుండగా.. కంట్రోలర్ల నియా మకాలు సైతం 50శాతం ఔట్ సోర్సింగ్ దిశగా సాగుతోందని సమాచారం.
డిపో క్లర్కు లు, ఇతర డిపో సిబ్బందిని సైతం ఔట్ సోర్సింగ్ ద్వారానే భర్తీ చేసేందుకు రంగం సి ద్ధం చేశారని అంటున్నారు. తార్నాకలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్లో సైతం ఇకపై అంతా ఔట్ సోర్సింగ్ విధానంలోనే నియామకాలుంటాయంటున్నారు. వైద్యులను కాంట్రాక్టు బేసిస్ లో తీసుకుంటున్నారని చెబుతున్నారు.
రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాల్సిందే...
ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్లుగా పనిచేసేందుకు రూ. 2 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ ఏజెన్సీలకు చెల్లించి ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు. అసలే పూటగడవని వారు ఈ ఉద్యోగం కోసం రూ. 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలని నిరుద్యోగులు అంటున్నారు. కేవలం రూ. 18 వేల జీతం కోసం వడ్డీలకు తీసుకువచ్చి డిపాజిట్ చెల్లించే పరిస్థితి దాపురించిందని వారు వాపోతున్నారు.
డ్రైవర్ కోసం హెవీ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ బ్యాడ్జ్ నెంబర్తో పాటు కనీసం 18 నెలల అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. డ్రైవర్లకు నెలకు రూ..22,500లతో పాటు ప్రతి రోజూ రూ.100 బత్త ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 2 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల చేతిలో దగా పడుతున్నారనేది అందరికీ తెలుసు.
శ్రమదోపిడీకి చిరునామాగా మారిన ఈ ఔట్ సోర్సింగ్ విధానాన్ని ఎత్తేసి ప్రత్యేకంగా ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఆర్టీసీ లేటుగా ఈ మోసపూరితమైన విధానాన్ని ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఔట్ సోర్సింగ్ పేరిట ఏజెన్సీలు ఉద్యోగుల జీతంలో కోత పెట్టడమే కాకుండా వారికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా లేకుండా వారి డబ్బులను కాజేస్తున్నాయి.
ఔట్ సోర్సింగ్
ఓ వైపు ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు.. మరోవైపు డిపోలకు డిపోలనే ప్రైవే టు సంస్థలకు అప్పగించే వ్యవహారం.. ఇప్పుడు డ్రైవర్లు, కండక్టర్ల ఔట్సోర్సింగ్ నియామకాలు.. వెరసి ఆర్టీసీ కార్మికుల గుండెల్లో గుబులు. త్వరలో ఆర్టీసీలో 3 వేల పోస్టుల భర్తీ పేరిట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాదికాలంగా హామీ ఇస్తు న్నా, అది ఉత్తిదే అనే పరిస్థితి కనిపిస్తోందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నా రు. 3వేలకు పైగా ఉద్యోగాలను భర్తీచేస్తారని ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు కూడా ఔట్సోర్సింగ్ నిరాశనే మిగిల్చింది.
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేసేందుకు ఎక్కడికక్కడ రీజినల్ మేనేజర్లకు ఆదేశాలిచ్చారు. దీనిపై ఆర్టీసీ జేఏసీ నేతలు రవాణా శాఖ మంత్రిని కలిసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టబోమని జేఏసీ నేతలకు చెప్పినట్లుగా వారు మీడియాకు వెల్లడించారు.
ప్రభుత్వానికి మచ్చ తెస్తుంది
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం వల్ల నిరుద్యోగుల్లో తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నది. దీనిపై లక్షల మంది ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని అధికారులు తప్పుదారి పట్టించి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. దీనివల్ల నిరుద్యోగులు, కార్మికులు ప్రభుత్వానికి దూరం అవుతారు. కొత్త విధానం తేవడం వల్ల ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వం వెంటనే ఈ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయాలి.
కె. రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్
ఆర్టీసీని కాపాడాలి
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానం ఉంటుందని ఊహించలేదు. కొత్తగా నియామకాలు అవుతాయని, మాకు పని భారం తగ్గుతుందని భావించాం. కానీ ఇలా ఔట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు, కండక్టర్లను నియమించి మాపై తీవ్ర ప్రభావం పడేలా చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇలా ఔట్ సోర్సింగ్ విధానం తేవడం ముమ్మాటికీ కరెక్టు కాదు. దీనిపై పునరాలోచించి ఆర్టీసీని కాపాడాలి.
మర్రి నరేందర్, ఎన్ఎంయూ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఔట్సోర్సింగ్ ఆగలేదు..
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఆర్ఎంలకు ఉత్తర్వులు వెళ్లాయని తెలిసి ఈ నెల 4న తాము జేఏసీ తరఫున రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి విజ్ఞప్తి చేశాం. ఔట్ సోర్సింగ్ భర్తీ ప్రక్రియ ఆపేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ అది హామీగానే ఉండిపోయింది. ఇప్పుడు ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ విధానం ప్రారంభం అయ్యింది. ఓవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు రద్దు, మరోవైపు ఆర్టీసీలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులు, మరోవైపు డిపోలే ప్రైవేటు సంస్థలకు అప్పగింత, ఇప్పుడు ఔట్ సోర్సింగ్ నియామకాలు... అసలు ఈ ప్రభుత్వం ఆర్టీసీని ఏం చేయాలనుకుంటోందో మాకు అర్థం కావడంలేదు.
ఈదురు వెంకన్న, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి