22-06-2025 12:56:06 AM
- రాష్ట్రంలో ముగిసిన రెవెన్యూ సదస్సులు
- 3 విడతల్లో 10 వేల రెవెన్యూ సదస్సులు
- 8.58 లక్షల దరఖాస్తుల స్వీకరణ
- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): దశాబ్దకాలం పాటు బీఆర్ఎస్ పాలనలో విధ్వంస మైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్వరాష్ర్టంలో ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కాం చూ పాలన్న ఆశయంతో తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో భూ భారతికి ముందు.. భూ భారతి తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదన్నారు.
రాష్ర్టవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ము గిసిన నేపథ్యంలో శనివారం అధికారులతో సమీక్షించారు. నాటి ప్రభుత్వం ఎంతో గొప్పగా 2020 లో తీసుకువచ్చిన ఆర్వోఆర్ చట్టాన్ని తొలగించామని పేర్కొన్నారు. పారదర్శక పాలనకు పెద్దపీఠ వేస్తూ, రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. పదేళ్లలో రైతులు పడ్డ కష్టాలు, బాధలు, వారు ఏవిధమైన సమస్యలను ఎదుర్కొన్నారో చెప్పేందుకు ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. మూడు దశల్లో దాదాపు 10 లక్షలకు పైగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తు లు వచ్చాయన్నారు. ఏప్రిల్ 14వ తేదీన భూభారతి చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా.. ఆరోజు నుంచే రెవెన్యూ వ్యవస్థలో నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు.
ఈ చట్టాన్ని దశల వారీగా అమల్లోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. మొదటి దశలో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు 4 మండలాల్లో నిర్వహించిన 72 రెవెన్యూ సదస్సుల్లో 12 వేల దరఖాస్తులు, రెండో దశలో మే 5వ తేదీ నుంచి 28 మండలాల్లో నిర్వహించిన 414 సదస్సుల్లో 46 వేల దరఖాస్తులు వచ్చా యన్నారు. సాదాబైనామాల అంశం మినహా సుమారు 60 శాతానికిపైగా సమస్యలకు పరిష్కా రం చూపామన్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 20 వ తేదీ వకు 561 మండలాల్లో 10,239 గ్రామా ల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని ఈ సదస్సుల్లో భూ సమస్యలకు సంబంధించి 8 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తంగా మూడు విడతల్లో 593 మండలాల్లో 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించగా.. 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి వివరించారు.
అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 67 వేలు, భద్రాద్రి కొత్తగూడెం 61 వేలు, వరంగల్ 54 వేలు, జయశంకర్ భూపాలపల్లి 48 వేలు, నల్లగొండ జిల్లాలో 42 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రెవెన్యూ సదస్సులకు ముందురోజే ఆయా గ్రామాల్లో రైతులకు ఉచితంగా దరఖాస్తులు ఇచ్చామన్నారు. తహసిల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, రెవెన్యూ అధికారులే ప్రజల వద్దకు వెళ్లి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరించారని తెలిపారు. స్వీకరించిన వాటికి రశీదులను అందజేశామన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని.. మిగిలిన వాటిని కూడా త్వరితగతిన నమోదు చేయాలని అధికారులకు సూచించారు.