27-06-2025 11:12:42 AM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని బాయమ్మ తోటలో గల రిషికళాశాల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతుందని తెలంగాణ మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల మోత. అధిక ఫీజులను అరికట్టలేని విద్యాధికారులు. అధిక ఫీజులకు నిరసనగా మహబూబ్ నగర్ బాయమ్మ తోటలో ఉన్న రిషి కాలేజ్ గేటు ముందు మాలల చైతన్య సమితి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలలో అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు అదనంగా ఇలా ఆదాయం సమకూర్తుంది అని ఆశతో బుక్స్, టై, బెల్టులు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ ఉన్నాయని తెలిపారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు అవసరమైన వస్తువులు విక్రయించకూడదని అని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అధిక లాభాలే పరమ అవధిగా భావిస్తూ విద్యార్థులకు అవసరమైన వివిధ మెటీరియల్ ను దర్జాగా వసూలు చేస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలలో అనుభవం లేని బోధన ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు ఇస్తూ విద్యా వ్యవస్థలను నడిపిస్తున్నారని విమర్శించారు. మా కాలేజీ యాజమాన్యం తెచ్చిన మెటీరియల్ నే విక్రయించాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తూ అధిక ఆర్థిక భారం మోపుతున్నారని తెలియజేశారు. విద్యాసంస్థలలో కనీస వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలలో నాన్ టీచింగ్ వర్కర్స్ ను తక్కువ జీతాలకు ఉపయోగిస్తూ వారిని సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పిలిపించడంతోపాటు పని ఒత్తిడి కి లోను చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యాధికారి. డి ఇ ఓ అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల పర్యవేక్షణ చేయడం లేదని, అసలు అధికారులు ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు.
-ప్రభుత్వ ఉద్యోగం... ప్రైవేటు విద్యాసంస్థలు..
ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ రిషి కళాశాలతో పాటు ఇతర ప్రైవేట్ కళాశాలలోను పెట్టుబడి పెడుతూ దర్జాగా పోగు చేసుకుంటున్నారు. ఎలాగైనా ప్రైవేట్ విద్య సంస్థలు ఉన్నత శిఖరాలకు చేరాలని సంకల్పంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ వారికి సంబంధించిన ప్రైవేట్ కళాశాలలో పెట్టుబడులు పెడుతూ మా పాఠశాల, మా కళాశాల బాగున్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆసనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసేందుకు ప్రైవేట్ కళాశాలలో పెట్టుకున్న వారు ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. కేవలం వారి విద్యాసంస్థలే బాగుపడేలా రోజురోజుకు ప్రైవేట్ విద్యాసంస్థలను పెంచుకుంటూ పోతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అధికారులు పూర్తిస్థాయిలో బాధ్యత వహించి అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న రిషి కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాటారం చెన్నయ్య,పత్తి యాదయ్య, బి వెంకట్రాములు, జి యాదగిరి, ఎం ప్రసాద్, విష్ణుమూర్తి, జి రామచందర్, జి యాదయ్య, ఎం ప్రసాద్, జంగయ్య,కురుమూర్తి తదితరులు ఉన్నారు.