హెల్మెట్ తప్పనిసరి – ప్రాణ రక్షణకు కీలకం
ఏఎస్పీ చిత్తరంజన్
వాంకిడి,(విజయక్రాంతి): అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని జైత్వాన్ బుద్ధ విహారంలో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ చిత్తరంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగోషే పెంటు (బెండార గ్రామం) కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ద్విచక్ర వాహనదారులకు 25 హెల్మెట్లు పంపిణీ చేశారు.
అలాగే మృతుడి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ... హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువగా ప్రాణనష్టం జరుగుతోందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




