24-06-2025 10:36:10 PM
ఇల్లెందు (విజయక్రాంతి): గ్రామీణ వైద్యులు పరిమితికి మించి వైద్యం చేయవద్దని ఇల్లందు డీఎస్పీ ఎన్. చంద్రభాను(DSP Chandrababu) సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో గ్రామీణ వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యులు రెండు రోజులు కంటే వైద్యం చేయవద్దన్నారు. గ్రామీణ వైద్యులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోమతెరలు వాడే విధంగా చైతన్య పరచాలని కోరారు. జ్వరం, కడుపు నొప్పితో గ్రామీణ వైద్యుల వద్దకు వైద్యం కోసం వస్తే వైద్యం చేసిన అదుపులోకి రాకపోతే కాలం వెళ్లబుచ్చి పేషెంట్ కు సీరియస్ అయ్యేంతవరకు చూడవద్దని, తక్షణమే మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు గానీ, ఆర్థిక స్తోమత ఉన్న వారైతే ప్రైవేటు వైద్యశాలలకు పంపాలని పేర్కొన్నారు.
వర్షాకాలంలో పొలాల్లో నాట్లు, కలుపుల సమయంలో దోమలు కుట్టడం లేదా ఇతర విష సర్పాలు వల్ల ఇబ్బందులు, డెంగూ, మలేరియా, ప్లేట్లెట్స్ పడిపోవడం తదితర బాధలతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున గ్రామీణ వైద్యులు స్వార్థం కోసం కాకుండా మెరుగైన వైద్యం అందించడానికి సహకరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో దోమతెరలు వాడే విధంగా అవగాహన కల్పించాలని, అర్హతకు మించిన వైద్యం చేయకుండా మీ అనుభవ రీత్యా వైద్యం అందించి మీ సేవలు కొనసాగించాలని కోరారు. అర్హతకు మించిన వైద్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎస్ఐలు సూర్య, హసీనా పఠాన్, స్టేషన్ సిబ్బంది, ఇల్లందు మండల గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.