విద్యుత్ స్తంభాలే ప్రచార పోల్లు
ఇబ్బడి ముబ్బడిగా పాఠశాల ప్రచార ఫ్లెక్సీలు
అనుమతి లేకుంటే చర్యలు : ట్రాన్స్కో ఏడీఈ
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పాఠశాల ప్రచారమే ప్రధానం, నిబంధనలతో మాకు పనేంటి అన్నట్లు ఉంది పాఠశాల యాజమాన్యం తీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో విద్యుత్ స్తంభాలే పాఠశాల ప్రచారానికి పోలుగా వినియోగిస్తున్న వైనం ఇది. పాల్వంచ పట్టణ పరిధిలో నూతనంగా ప్రారంభించిన ఫాల్కన్ స్కూల్ ప్రచార బోర్డులు విద్యుత్ స్తంభాలకు దర్శనమిస్తున్నాయి.
వాస్తవంగా విద్యుత్ స్తంభాలకు ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ట్రాన్స్కో శాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఫాల్కన్ పాఠశాల ఆ నిబంధనను తుంగలో తొక్కి పాల్వంచ పట్టణం యావత్తు విద్యుత్తు స్తంభాలకు పాఠశాల బోర్డులో ఏర్పాటు చేయడం గమనార్హం. ఏ విషయమై ట్రాన్స్కో ఏడీఈ మహమ్మద్ రహీం ఉల్ హుస్సేన్ ను వివరణ కోరగా అనుమతి లేకుండా ఎలాంటి ప్రచార బోర్డులను విద్య స్తంభాలకు ఏర్పాటు చేయరాదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.






