21-08-2025 11:27:20 AM
హైదరాబాద్: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం(Bhadrachalam) సమీపంలో నది ఉప్పొంగుతూనే ఉండటంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం రాత్రి 10 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులు ఉండగా, గురువారం నాటికి అది 50.8 అడుగులకు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. వరద నీరు కళ్యాణకట్టలోకి చేరుకుంది. విద్యుత్ స్తంభాలు, స్నాన ఘాట్ వద్ద ఉన్న మెట్లు మునిగిపోయాయి.
పట్టణంలోకి నీరు రాకుండా నిరోధించడానికి, అధికారులు కరకట్ట వద్ద స్లూయిస్ గేట్లను మూసివేశారు. ఇంతలో, ధవళేశ్వరం వద్ద 9.88 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. ఇక్కడ నీటి మట్టం 11.9 అడుగులకు చేరుకుంది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖార్ జైన్ కోరారు. నదీ పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న ప్రవాహాంతో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గోదావరి ఉగ్రరూపంతో ప్రభావితమవుతున్న లంక గ్రామాలు, రాజమండ్రి పరిసర లంకల్లో నివసిస్తున్న 300 మంది మత్స్యకారుల తరలించారు.