21-06-2025 12:25:21 AM
మఠంపల్లి, జూన్ 20 : మఠంపల్లి మండలంలో నాటుసారా తయారీ జోరందుకుంది. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తక్కువ ధరల్లో లభించే గుడుంబా వైపు మరులుతున్నారు. దీంతో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని వివిధ ప్రాంతాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది.
గుట్టుచ ప్పుడు కాకుండా ప్లాస్టిక్ కవర్లలో నింపి రవాణా చేస్తున్నారు. తండాలలో మారుమూల గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాలపై ఇతర గ్రామాలు,పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు సారా తయారీనే వృత్తిగా మలుచుకొని పెద్దఎత్తున తయారుచేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
మఠంపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో నల్లా బెల్లం,పటిక ఆంధ్ర రాష్ట్రం నుంచి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కొందరు నల్లా బెల్లం దొరక్క పోయిన ఇంట్లో ఉపయోగించే తెల్ల బెల్లం ఉపయోగించి గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నారు. మఠంపల్లిలోని కొన్ని కిరణం దుకాణదారులు ఈ తెల్ల బెల్లం సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
గుడుంబాపై ఎక్సైజ్ శాఖ నిఘా కరువు
మండలంలోని నిషేధిత గుడుంబాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో విచ్చలవిడిగా నాటుసారా తయారవుతుందనే వాదన వినిపిస్తోంది. సారా అమ్మకాలు ఆగాలంటే తయారీ మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
గుట్టుగా తయారీ చేస్తూ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గుడుంబాను పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాకాలం సీజన్ కావడంతో పంట చేన్ల వద్ద గుట్టుగా తయారు చేస్తున్నారు.
అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు. తండాలపై దాడులు నిర్వహించి సారా అమ్మకాలపై వెతుకుతున్నారు. మూలాలను వెతకకుండా ఎక్కడో ఒకచోట దాడులు నిర్వహిస్తున్నారు. సారా ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించి పక్కా వ్యూహంతో దాడులు చేస్తే అసలు నిందితులు దొరికే అవకాశం ఉంది.
మందుబాబులు నాటుసారా వైపు
మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం తాగాలంటే వందల రూపాయలు వెచించాల్సి వస్తోంది. క్వాటర్ మద్యం కోనాలన్నా రూ.200 లకు పైగానే ఖర్చవుతోంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరల్లో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు మందుబాబులు నాటుసారా వైపు చూస్తున్నారు.
గుడుంబా అమ్మకాలు గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులా పారుతుంది. రోజువారి కూలీ పనులు చేసుకుని బతికేవారు చాలా మంది సారా తాగుతున్నట్లు సమాచారం.
తయారు చేస్తే కఠిన చర్యలు
సారా నివారణ కొరకు నిరంతరం కృషి చేస్తున్నాం. బెల్లం పటిక సరఫరా చేస్తున్న వారిపై నిఘా ఉంచాము, సారా కాస్తున్న, వెహికల్ పై సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి వెహికల్ సిజ్ చేసాము. గుడుంబాను ఎవరైనా తయారుచేసిన, అమ్మిన వారిపై తప్పక కఠిన చర్యలు తీసుకుంటాం.
- నాగార్జున రెడ్డి, అబ్కారీ సిఐ హుజూర్నగర్