2 August, 2026 | 12:11 PM

భక్తిశ్రద్ధలతో లష్కర్ బోనాలు

02-08-2026 11:04 AM

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని చారిత్రక శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో(Secunderabad Ujjaini Mahankali Bonalu) ఆదివారం ప్రారంభమైన రెండు రోజుల బోనాల ఉత్సవాలతో సికింద్రాబాద్, దాని పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళి అమ్మవారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనం ఇస్తున్నారు. బోనాల పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు 2,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు.

సికింద్రాబాద్, దాని పరిసర ప్రాంతాలలోని వీధులు, సందులు రంగురంగుల పూలు, ఎల్ఈడీ దీపాలతో అలంకరించడంతో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు వేచి ఉండటంతో ఆలయం వద్ద పొడవైన క్యూ లైన్లు కనిపించాయి. భక్తుల కోసం, అమ్మవారికి ‘బోనం’ సమర్పించే మహిళల కోసం దేవాదాయ శాఖ ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, దాని పరిసర ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.