06-06-2025 12:00:00 AM
మానుకోట జిల్లాలో 167 పాఠశాలల మూత
మహబూబాబాద్, జూన్ 5 (విజయ క్రాంతి): విద్యార్థులు బడికి రావడం లేదని, 0 హాజరు శాతం సాకుతో మహబూబాబాద్ జిల్లాలో 2024 25 విద్యా సంవత్సరంలో 167 ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. ఇందులో 140 పాఠశాలలు గిరిజన ఆవాస ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. మహబూబాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో 350 ప్రభుత్వ పాఠశాలలో ఉండగా అందులో 50 మూతపడ్డాయి.
డోర్నకల్ నియోజకవర్గంలో వీడు మండలాల్లో 329 పాఠశాలలు ఉండగా 78 పాఠశాలలను మూసివేశారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పెద్దవంగర మండలాల్లో 82 పాఠశాలలు ఉండగా 12 పాఠశాలలు మూసివేశారు. అలాగే ఇల్లందు నియోజకవర్గంలోని మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న గార్ల బయ్యారంలో 136 పాఠశాలలు ఉండగా 12 పాఠశాలలు మూసివేశారు.
అలాగే ములుగు నియోజకవర్గ పరిధిలో మహబూబాబాద్ జిల్లాలోని గంగారం కొత్తగూడ మండలాల్లో 98 పాఠశాలలో ఉంటే 15 పాఠశాలలు విద్యార్థుల హాజరు లేదని కారణంగా మూసివేశారు. గత విద్యా సంవత్సరం ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఆవాస ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బడి మూసివేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమేరకు గతంలో మూసివేసిన ప్రతి పాఠశాలకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజున ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపి దాదాపు పక్షం రోజులపాటు విద్యార్థుల రాక కోసం నిరీక్షించినా ఫలితం లేకుండా పోవడమే కాకుండా 2023 24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024 25 విద్యా సంవత్సరంలో మూసివేసిన పాఠశాలల సంఖ్య మరికొంత జోడించడం విశేషం. ఇదిలా ఉంటే మూతపడ్డ పాఠశాలల ఆవాస ప్రాంతాల్లో బడి ఈడు పిల్లలు ఉన్నప్పటికీ ప్రభుత్వ బడికి రాకుండా ప్రైవేటు బడికి వెళ్లడం మరో విశేషం.
మండలాలవారిగా మూసివేసిన పాఠశాలల వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ 19, కేసముద్రం 8, గూడూరు 11, ఇనుగుర్తి 8, నెల్లికుదురు 4, డోర్నకల్ 12, కురవి 6, మరిపెడ 36, సీరోల్ 3, నరసింహుల పేట 6, దంతాలపల్లి 6, చిన్న గూడూరు 9, తొర్రూర్ 8, పెద్ద వంగర 4, గార్ల 9, బయ్యారం 3, కొత్తగూడ 8, గంగారం 7 --------
బడి బాటలో మూసివేసిన బడులను తెరిపించాలి
నేటి నుంచి చేపట్టే బడిబాట కార్యక్రమంలో మహబూబా బాద్ జిల్లా వ్యాప్తంగా 167 ఆవాస ప్రాంతాల్లో మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరిపించాలి. డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మూసివేసిన పాఠశాలలకు కేటాయించాలి. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనతో పాటు విద్యార్థులకు అమలు చేస్తున్న సౌకర్యాలను సమగ్రంగా వివరించి తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించే విధంగా కృషి చేయాలి. కేవలం మొక్కుబడిగా బడిబాట నిర్వహిస్తే ఈ ఏడాది మూసివేసే పాఠశాలల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మైస శ్రీనివాసులు, స్టేట్ కో కన్వీనర్ తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ