11-10-2025 12:21:45 AM
బిచ్కుంద కోర్టు తీర్పు వెల్లడించినట్లు తెలిపిన ఎస్పీ రాజేష్ చంద్ర
బిచ్కుంద, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, లేదా రూ.3వేల జరిమానా విధిస్తూ బిచ్కుంద కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పి రాజేష్ చంద్ర పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2020 జులై 17న బిచ్కుందకు చెందిన ఈడెం పోచవ్వ తన ఇంటి నుంచి మధ్యాహ్నం సమయంలో మార్కెట్కు బయలుదేరింది.
బిచ్కుందలోని మెయిన్ రోడ్డులో ఓ దుండగుడు మీకు పింఛన్ డబ్బులు వచ్చాయి. బ్యాంకు అకౌంట్లో పడ్డాయని మాయమాటలు చెప్పి పక్కనున్న సందులోకి తీసుకెళ్లి ఆమె మెడలోని తులం బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కుమారుడు బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన వాగ్మారే దిగంబర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు.
చోరీ చేసిన బంగారు గొలుసును పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన సుబ్బుర్ వార్ తుకారాంనకు అమ్మినట్లు తెలిపాడు. దాంతో తుకారంను కూడా అరెస్ట్ చేశారు. కేసులో సాక్షాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రధాన నిందితుడు దిగంబర్ మృతి చెందడంతో.. దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి తుకారాంనకు బిచ్కుంద జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వినీల్ కుమార్ ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 3వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.