10 July, 2026 | 9:49 PM

యుద్ధాలు, అంతరాలు లేని సమాజమే కమ్యూనిస్టుల లక్ష్యం: చాడ వెంకట్ రెడ్డి

10-07-2026 08:37 PM

వనపర్తి మండలం: అంతరాలు లేని సమ సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని అందుకు సమాజాన్ని చైతన్యం చేసి పోరాడాలని సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి లో శుక్రవారం సిపిఐ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుల మూడు రోజుల (జూలై 10, 11, 12) శిక్షణ తరగతుల ప్రారంభం సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకటరెడ్డి తరగతులను ప్రారంభించారు. నాగర్ కర్నూల్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ అధ్యక్షతన జరిగిన శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. ప్రపంచంలో యుద్ధ వాతావరణం రాజ్యమేలుతుందన్నారు.

అమెరికా ఇజ్రాయిల్ లాంటి దేశాలు నరమేధానికి ఉసిగొలిపాయని యుద్ధం ఎప్పుడు హింస, అశాంతినే మిగిల్చుతుందన్నారు. స్వాతంత్ర్య అనంతరం భారతదేశం అలీన విధానంతో ముందుకు సాగిందని అందుకు భిన్నంగా నరేంద్ర మోదీ యుద్ధం పట్ల వ్యవహరించిన తీరు ప్రపంచంలో భారత పరువును తీసిందన్నారు. బిజెపిరామ మందిరం పేరుతో అధికారంలోకి వచ్చి, అదే రామ మందిరంలో దొంగలు పడి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ప్రధాని నేటికి పెదవి ఇవ్వకపోవడం దారుణమని, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాముని పేరుతో అధికారం చేతికించుకొని మత రాజకీయాలు నడుపుతూ ప్రజల సమస్యలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని బిజెపి తీరును దుయ్యబట్టారు.

రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయని ఆరు గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి నెరవేర్చటంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తీవ్ర రాజకీయ జోక్యం పెరిగిందని అర్హులైన వారికి ఇండ్లు రావడం లేదని, వారికి ఇవ్వాలన్నారు. ‌ భూదాన భూముల్లో పేదలు ఎర్రజెండాలు పాతి ఇండ్లు నిర్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి పేదలను రోడ్డు పాలు చేశారన్నారు. మహిళలకు 2500 ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడం నిరుద్యోగుల కల నెరవేరలేదని, ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి పై ఉందని పాలమూరు రంగారెడ్డి కే ఎల్ ఐ బీమా జూరాల పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.

హామీల అమలు, ప్రాజెక్టుల పూర్తికి ప్రజా ఉద్యమాలు నిర్మించి సిపిఐ ముందుండి పోరాడుతుందని ప్రజలు కలిసి రావాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి బాలకిషన్, గద్వాల జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు, రాస సమితి సభ్యుడు కేశవులు గౌడ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా నేతలు కళావతమ్మ టీ నరసింహ శ్రీరామ్ మోష గోపాలకృష్ణ సురేష్ ఇందిర కృష్ణవేణి గీత ఈర్ల చంద్రమౌళి మల్లేష్ కృష్ణ రాబర్ట్ అబ్రహం రంగన్న కిష్టన్న నాగార్జున శంకర్ గౌడ్ కుతుబ్ శ్రీనివాస్ ప్రేమ్ కుమార్ బండి లక్ష్మీపతి బిజ్జ శ్రీను వంక గోపాల్ డంగుకురుమయ్య తదితరులు పాల్గొన్నారు.