calender_icon.png 20 February, 2026 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు

20-02-2026 01:59:37 AM

రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి

కల్వకుర్తి, ఫిబ్రవరి 19: వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులను ప్రోత్సహిస్తే రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన లాభాలు సాధ్యమవుతాయని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన భూసార పరీక్షల అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో రైతులకు మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై వివరించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు. రైతులకు మినీ కిట్లు, భూసార పరీక్ష పరికరాలు పంపిణీ చేశారు. పంటలు విత్తే ముందు మట్టి పరీక్ష చేయించుకోవడం ద్వారా నేలలోని పోషకాలు, పిహెచ్ విలువ, సేంద్రియ పదార్థాల శాతం తెలుసుకుని సరైన ఎరువులు వాడుకోవచ్చని చైర్మన్ తెలిపారు. అవసరానికి మించి ఎరువులు వేయడం వల్ల భూమి సారం తగ్గి, రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుందన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హరిత విప్లవానికి పునాదులు వేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలతో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ భూసార పరీక్షలతో రైతులు ఖర్చులు తగ్గించుకుని, ఆరోగ్యకరమైన పంటలు సాగు చేయవచ్చని తెలిపారు.