పాఠశాల స్థాయిలో సమస్యలను గుర్తించాలి
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని పాఠశాలల స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి తగిన పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ, అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్రస్థాయి అధికారి, జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సూచించారు. శని వారం మంచిర్యాల జిల్లాలో పాఠశాల స్థాయి కార్యక్రమాలపై విద్యాశాఖ పర్యవేక్షణలో భాగంగా, ప్రత్యేకంగా నియమించబడిన రాష్ట్రస్థాయి అధికారి గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల స్థాయిలో నిర్వహించబడుతున్న వివిధ విద్యా కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాఠశాలల్లో ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, విద్యార్థుల అభ్యసన స్థాయిలను మెరుగుపరచడం, నాణ్యమైన విద్యను అందించడం, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదల, ఉపాధ్యాయుల బోధనా విధానాలు, విద్యార్థుల హాజరు, పాఠశాలల్లో మౌలిక వసతులు, PM SHRI కార్యక్రమాల అమలు, పాఠశాల స్థాయిలో చేపడుతున్న ఇతర ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు.
అంతకు ముందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల న్యూ గర్మిళ్లను సందర్శించి, ఉపాధ్యాయుల తరగతి గది బోధనను పరిశీలించారు. ఈ సమీక్ష సమావేశంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు ప్లానింగ్ అండ్ ఎమ్ ఇ ఎస్ కోఆర్డినేటర్ ఎం భరత్ కుమార్, క్వాలిటీ కోఆర్డినేటర్ జంబోజు సత్తయ్య, ఎ ఎస్ సి ఆడిచర్ల రాజ్ కుమార్, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్, పిఎం శ్రీ ప్రధానోపాధ్యాయులు, జిల్లాలోని మండల విద్యాధికారులు (MEO)లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, PM SHRI పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






