త్వరలో సీఎంకు ఉద్యోగ సంఘాల కోరికలు
నిర్ణయించిన త్రిసభ్య కమిటీ
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఇకపై తరచూ భేటీ కావాలని నిర్ణయించింది. త్రిసభ్య కమిటీ సభ్యులైన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య మంగళవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్లో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఇప్పటికే అందిన పలు వినతిపత్రాలను పరిశీలించారు. అన్నింటిని క్రోడీకరించి ఒక నివేదికను సీఎం రేవంత్రెడ్డికి అందించాలని, ఇక నుంచి తరచూ భేటీ కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ముందుకు సాగుతామని చిన్నారెడ్డి తెలిపారు.






