ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ పారదర్శకంగా నిర్వహించాలి
బాధితుల ఫిర్యాదులపై బాధ్యతాయుతంగా, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి
స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ను జిల్లా పోలీసు అధికారి అఖిల్ మహాజన్ ఆకస్మికంగా మంగళవారం సాయంకాలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్లోని అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, కేసుల దర్యాప్తును నాణ్యతతో పూర్తి చేయాలని, బాధితుల ఫిర్యాదులపై సత్వర స్పందనతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు సానుకూల వాతావరణం కల్పించేలా స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, రాత్రి గస్తీని మరింత పటిష్ఠం చేస్తూ ఆర్థిక నేరాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనల అమలులో రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే,ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ. సాయన్న, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






