calender_icon.png 12 June, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టూరిస్టులకు శుభవార్త

10-06-2025 10:54:31 PM

పర్యాటక ప్రాంతాలకు మానుకోట నుంచి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పర్యాటకులు, భక్తుల కోసం ఆర్టీసీ మహబూబాబాద్ డిపో నుండి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం. శివ ప్రసాద్(Depot Manager M. Shiva Prasad) తెలిపారు. ఒకరోజు పర్యటన కోసం మహబూబాబాద్ డిపో నుండి హనుమకొండ వేయి స్తంభాల గుడి భద్రకాళి దేవాలయం ఖిలా వరంగల్ పర్యటించవచ్చని, ఒక్కొక్కరికి 450 రూపాయల చార్జీతో ఉదయం 5 గంటలకు బస్సు మహబూబాబాద్ డిపో నుండి బయలుదేరుతుందన్నారు. అలాగే ములుగు జిల్లా మల్లూరు, బోగత జలపాతం, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఒక రోజు పర్యటనకు 650 రూపాయల చార్జీతో ఒక్కొక్కరు ప్రయాణించవచ్చని ఈ బస్సు ఉదయం 4 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు.

అలాగే వేములవాడ రాజన్న దేవాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం, ధర్మపురి యోగ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, గూడెం గట్టు సత్యనారాయణ స్వామి దేవాలయం ఒకరోజు పర్యటన కోసం ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఇందుకు ఒక్కో ప్రయాణికుడు 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక ఇదే విధంగా సూర్యాపేట నుండి నాగార్జునసాగర్, మాచర్ల చెన్నకేశ్వర స్వామి దేవాలయం, శ్రీశైలం రెండు రోజులపాటు ప్యాకేజీ డీలక్స్ బస్సులో ప్రయాణించే విధంగా ప్రత్యేక సర్వీసు నడుపుతున్నామని, ఈ బస్సులో ఒక్కొక్కరు 1,500 రూపాయలు చార్జీ చెల్లించాల్సి ఉంటుందని రాత్రి 11 గంటలకు సర్వీస్ బయలుదేరుతుందని చెప్పారు.

అలాగే మహబూబాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట దేవాలయాల సందర్శన టూర్ ప్యాకేజీ 48 గంటల పాటు నిర్వహించడం జరుగుతుందని, డీలక్స్ బస్సు చార్జీ 1,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ బస్సు కూడా రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని డీఎం తెలిపారు. మరిన్ని వివరాలకు 9959226054, 94417138 96 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.