05-06-2025 12:00:00 AM
చేర్యాల, జూన్ 4: సిద్దిపేట జిల్లా చేర్యాలలో ప్రభుత్వ అనుమతి లేకుండానే కార్పొరేట్ పాఠశాల పేరుతో తల్లిదండ్రులను బురిడి కొట్టిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మామూళ్లకు అలవాటు పడిన విద్య శాఖ అధికారులు రెండు సంవత్సరాలుగా కళ్ళుమూసుకొన్నారు. పాఠశాలలు ఇచ్చిన పైకానికి అధికారులు తలొగ్గారా లేక రాజకీయ బడా నాయకుల హస్తం ఉందా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.
చేర్యాలలో ఒక్కో ప్రైవేటు పాఠశాల ఒక్కో రకంగా మోసాలకు పాల్పడుతున్నాయి. సీబీఎస్ అనుమతి లేకుండా ఉన్నట్టు ప్రచారం చేసుకోగా, మరో పాఠశాల యజమాన్యం గుర్తింపు ఉన్నది ఒకటైతే, కార్పోరేట్ పాఠశాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నది. ఆకర్షణీయమైన కరపత్రాలను ప్రచురించి, గ్రామాలలో తిరుగుతూ ప్రచార ఆర్భాటాలకు తెరలేపుతూ, అమాయకమైన తల్లిదండ్రులను లోబర్చుకుంటున్నాయి.
ఉన్నవి, లేనివి చెబుతూ అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. చేర్యాల పట్టణంలోని సుమారు పది ప్రైవేటుపాఠశాలు ఉన్నాయి. వీటిలో అన్ని స్టేట్ సిలబస్ అనుమతులు మాత్రమే ఉన్నాయి. కానీ కొన్ని పాఠశాలలు తమకు సీబీఎస్సీ అనుమతులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నాయి. జిల్లాలోనే రెండు పాఠశాలలకు మాత్రమే సి బి ఎస్ సి అనుమతులు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
శ్రీ చైతన్య మాయాజాలం...
శ్రీ చైతన్య యజమాన్యం రెండు సంవత్సరాల క్రితం చేర్యాల పట్టణంలో బ్రాంచ్ ప్రారంభించారు. మొదటి సంవత్సరం స్థానికంగ ఓపాఠశాల యజమాన్యంతో పొత్తు ఏర్పాటు చేసుకొని ఆ పాఠశాల గుర్తింపుతోనే కొనసాగించారు. ఆ పాఠశాలతో పొత్తు చెడడంతో, రెండో సంవత్సరం శ్రీ చైతన్య యజమాన్యం స్థానికంగా ఉన్న శుభోదయం విద్యాలయంతో పొత్తును కుదుర్చుకుంది.
శుభోదయం విద్యాలయం గుర్తింపుతో శ్రీ చైతన్య పేరుతో కొనసాగిస్తూ కార్పొరేట్ స్థాయి ఫీజులు వసూలు చేస్తున్నారు. శుభోదయం విద్యాలయం (శ్రీ చైతన్య)కు స్టేట్ సిలబస్ గుర్తింపు ఉండగా, ప్రచారం చేసుకునేది మాత్రం సిబిఎస్సీ సిలబస్ గా చెప్పుకుంటుంది. రికార్డుల నమోదుకు మాత్రం శుభోదయం పేరు మీదనే నడుస్తున్నాయి.
ఓక్లే పాఠశాల బాగోతం...
గతేడాది పట్టణంలో ఓక్లే పేరు మీద మరో పాఠశాల వెలిసింది. ఈ పాఠశాలకు స్టేట్ సిలబస్ అనుమతి మాత్రమే ఉంది. కానీ తమ పాఠశాలకు సీబీఎస్సీ అనుమతి ఉందంటూ గత సంవత్సరం అడ్మిషన్లను స్వీకరించింది. నాలుగైదు నెలల క్రితం విద్యాధికారులు తనిఖీ చేయగా ఏ ఒక్క పాఠశాలకు సీబీఎస్సీ అనుమతి లేదని తేటతెల్లమైంది. దీంతో విద్యాధికారులు విద్యార్థుల భవిష్యత్తును దృష్ట్యా చర్యలకు వెనుకాడారు. విద్యాధికారులు ఇటీవల తనిఖీలు చేపట్టి అనుమతులు లేని పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు.
ఫీజులను నియంత్రణ ఏది
ప్రైవేటు పాఠశాలల యజమాన్యం సీబీఎస్సీ సిలబస్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా టెకస్ట్ బుక్ లను, నోట్ బుక్కులను, యూనిఫారమ్స్, తమ దగ్గరనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎల్ కే జీ, యూకేజీ పిల్లలకే రూ.40 నుంచి 50 వేల ఫీజులను వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాధికారులు ఫీజుల కట్టడికి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
నోటీసులు జారీ చేశాం...
గుర్తింపు లేని పాఠశాలకు నోటీసులు జారీ చేశాము. యజమాన్యాలకు రెండు వారాలు గడువు ఇవ్వడం జరిగింది. గడువులోగా అనుమతులు తీసుకుంటే సరే, లేని పక్షంలో చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము. పాత గుర్తింపును కొనసాగిస్తామంటే, కొత్త పేర్లతో ప్రచారం చేసుకోవద్దని, ప్రచారం చేస్తే సంబంధిత పాఠశాలను సీజ్ చేస్తాము.
ఎంఈఓ రాచ్ఛ కిష్టయ్య
గుర్తింపును రద్దు చేయాలి..
అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తున్న యజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలీ. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్స్ చేసుకున్నారు అలాంటి విద్యార్థులను అనుమతు లున్న పాఠశాలలోకి పంపించాలి. అనుమతులు లేని పాఠశాలల తెరవక ముందే సీజ్ చేయాలి. ఫీజుల కట్టడికి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఫీజులను నిర్ణయించాలి. ఉంచాలి.
తాడూరి భరత్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి