ఎస్ఎస్ఎంబీ షురూ
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్బాబు కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘ఎస్ఎస్ఎంబీ29’గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటనలేవీ లేకున్నా ఇప్పటికే ప్రపంచ స్థాయిలో ఆసక్తి నెలకొంది. దీనికి గురించి ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమాలు కానిచ్చేసిన ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు దర్శకుడు రాజమౌళి.
షూటింగ్ ప్రారంభమైందన్న విషయాన్ని తెలియజేస్తూ.. ఒక వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఈ వీడియోలో సింహం బోనులో బంధించి ఉన్నట్టున్న ఓ చిత్రం వద్ద దర్శక ధీరుడు నిల్చోని ఓ పాస్పోర్టును చూపిస్తూ కనిపించారు. ఈ వీడియోకు ‘క్యాప్చర్’ అనే క్యాప్షన్ పెట్టారు. ఇటీవల మహేశ్బాబు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలోని సింహం పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు..
అంటే మహేశ్ను సింహంతో పోల్చుతూ ఆయన పాస్పోర్టును లాక్కొని, ఆయన్ను తన ఆధీనంలోకి తీసుకున్నాను’ అనే అర్థం వచ్చేలా ఈ వీడియోను రూపొందించినట్టు తెలుస్తోంది.
ఈ వీడియోతో తాజాగా ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో తాను భాగమైన విషయాన్ని ప్రియాంక చోప్రా తన రిప్లు పోస్ట్తో ఖరారు చేసింది. ఈ వీడియో పోస్ట్పై మహేశ్ స్పందిస్తూ ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..’ అన్న పోకిరి సినిమాలోని డైలాగ్ను కామెంట్ చేశారు. రాజమౌళి పోస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియా సరదా మీమ్స్తో నిండిపోయింది.






