వెదురు సాగుతో స్థిర ఆదాయం
వాంకిడి, (విజయక్రాంతి): రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయంగా వెదురు సాగు చేపట్టి లాభాలు పొందవచ్చని, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కోఆర్డినేటర్ సురేష్ తెలిపారు. మంగళవారం వాంకిడి మండలంలోని జంబుల్ధరి గ్రామపంచాయతీలో జిల్లా కోఆర్డినేటర్ సురేష్ ఆధ్వర్యంలో వెదురు మొక్కల పెంపకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి రైతుకు 60 మొక్కలు అందజేస్తామని, వీటిని 15 గుంటల భూమిలో నాటుకోవాలని సూచించారు. నాలుగేళ్లకు చేతికి వచ్చే ఈ పంటను నేరుగా పరిశ్రమల వారే కొనుగోలు చేస్తారని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏటా కోత కోస్తూ.. 15 గుంటల్లోనే రూ. 40 వేల నుండి రూ. 50 వేల వరకు ఆదాయం పొందవచ్చని వివరించారు. ఈ సమావేశంలో సర్పంచ్ పవన్, ఐకేపీ సీసీ భీంరావ్, వీఓఏ ఆనంద్రావు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.






