లారీ ఢీకొని స్టాఫ్ నర్సు దుర్మరణం

28-04-2024 12:47:57 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27(విజయక్రాంతి): ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళను వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీలో రవి హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న ప్రశాంతికుమారి (37) తన ద్విచక్ర వాహనంపై కేపీహెచ్‌బీ కాలనీ నుంచి కూకట్‌పల్లి వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ప్రశాంతి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.