పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్
హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర(Stephen Raveendra) మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాజా పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని సూచించారు. ఎల్పీజీ గృహ కనెక్షన్ల 1.28 కోట్ల ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్నారు. నిన్న 54 శాతం ఎక్కువ సరఫరా చేశామని తెలిపారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్లో 596 ఔట్లెట్స్ ఉన్నాయన్న స్టీఫెన్ రవీంద్ర నిన్న 2.80 లక్షల సిలిండర్లు బుక్ చేశారని తెలిపారు. డిమాండ్ కన్నా ఎక్కువ గ్యాస్ సప్లై చేస్తున్నామన్నారు. ప్రజలు ఓవర్ బుకింగ్ చేయడం వల్లే ఇబ్బందులు కలుగుతున్నాయని స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులకు ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. పీఎన్జీ, సీఎన్జీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వెల్లడించారు.




