మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ
హైదరాబాద్: ప్రజాభవన్లో శనివారం జరిగిన ‘స్త్రీనిధి యాన్యువల్ యాక్షన్ ప్లాన్’(Stree Nidhi Annual Action Plan) అమలు కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ మహిళలకు స్త్రీనిధి ఒక నమ్మకమైన బ్యాంక్గా ఎదగాలని ఆకాంక్షించారు. మైక్రో ఫైనాన్స్ వేధింపుల నుండి మహిళలకు విముక్తి కల్పించడానికే స్త్రీనిధి ఏర్పాటయిందని, ఇప్పటివరకు రూ. 24 వేల కోట్ల రుణాలను 32 లక్షల మంది మహిళలకు అందించి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడిందని కొనియాడారు. తెలంగాణ స్త్రీనిధి మోడల్ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని సీతక్క పేర్కొన్నారు.
సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు చేసే తప్పుడు ఆరోపణలపై వెంటనే వెరిఫై చేసి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటైన స్త్రీనిధి ఉద్యోగ సంక్షేమ సంఘాన్ని అభినందిస్తూనే.. ఉద్యోగులు హక్కులతో పాటు విధులను కూడా గుర్తుంచుకోవాలని, సంస్థను అందరం కలిసి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చిన్న వ్యాపారాలు, గృహాధారిత ఉపాధితో పాటు ఆదివాసీ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. స్త్రీనిధి ఏర్పాటు, విజయవంతంలో కృషి చేసిన వారందరినీ మంత్రి సీతక్క అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సిఎస్ దాని కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీనిధి డీఎండీ శ్రీనాథ్, ఉద్యోగులు పాల్గొన్నారు.






