03-02-2026 07:35:28 PM
తహసిల్దార్ ఎల్లన్న
చిన్నచింతకుంట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని తహసిల్దార్ ఎల్లన్న తెలిపారు. మంగళవారం కురుమూర్తి గ్రామంలో సీఎం కప్ మండల స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని బాలబాలికలు క్రీడల్లో రాణించేలా ఇప్పటినుంచే క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ క్రీడైన కబడ్డీలో చక్కటి కనబరిచి మంచి ఫలితాలను సాధించాలని ఎంపీడీవో లక్ష్మీ నరసింహులు తెలిపారు.
ఈ క్రీడలు మానసికల్లాసాన్ని, ఐకమత్యాన్ని చాటుతాయని ఎంఈఓ మురళి కృష్ణ తెలిపారు. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో 9 జట్లు, బాలికల విభాగంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. ఈ కబడ్డీ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన బాలుర విభాగంలో కురుమూర్తి (ప్రథమ స్థానం) వడ్డేమాన్ (ద్వితీయ స్థానం) బాలికల విభాగంలో కేజీబీవీ, సీసీ కుంట (ప్రథమ) వడ్డేమాన్ (ద్వితీయ) స్థానాన్ని సాధించినట్లు కబడ్డీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కథలప్ప, గ్రామ సర్పంచ్ కురుమన్న, ఎస్సై ఓబుల్ రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేష్, వీరాంజనేయ యువజన సంఘం అధ్యక్షులు రాజు నాయుడు, మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, పిఈటిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.