సన్ఫార్మా లాభం 33 శాతం వృద్ధి
ఆదాయం రూ.11,982 కోట్లు
న్యూఢిల్లీ, మే 22: దేశంలో అతిపెద్ద ఫార్మా కంపెనీ అయిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన క్యూ4లో 33.8 శాతం వృద్ధిచెంది రూ. 2,655 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 1,984 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. క్యూ3లో ఆర్జించిన రూ. 2,524 కోట్లతో పోలిస్తే తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 5.2 శాతం వృద్ధిచెందింది. మార్చి క్వార్టర్లో సన్ఫార్మా ఆదాయం 9.6 శాతం వృద్ధితో రూ. 10,930 కోట్ల నుంచి రూ. 11,983 కోట్లకు చేరింది. అయితే క్యూ3 ఆదాయం రూ. 12,380 కోట్లతో పోలిస్తే 3.2 శాతం తగ్గింది. కంపెనీ ఇబిటా 8.3 శాతం వృద్ధిచెంది రూ. 3,034 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్ 70 బేసిస్ పాయింట్లు పెరిగి 25.2 శాతానికి చేరింది. యూఎస్లో తమ ఫార్ములేషన్స్ అమ్మకాలు 476 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఇతర వర్థమాన మార్కెట్లలో 245 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపినట్టు సన్ఫార్మా తెలిపింది. ఇండియా ఫార్ములేషన్ విక్రయాలు 10.2 శాతం వృద్ధితో రూ. 3,707 కోట్లకు చేరాయి. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ,. 5 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది.






