13-06-2025 01:50:28 PM
న్యూఢిల్లీ: అమరావతి మహిళలపై ఒక ప్యానెలిస్ట్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జూన్ 9న అరెస్టు చేయబడిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు( journalist Kommineni Srinivasa Rao) సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసి, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. తన అరెస్టు మరియు రిమాండ్ను సవాలు చేస్తూ జర్నలిస్ట్ దాఖలు చేసిన రిట్ పిటిషన్లో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేనికి సబంధం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కొమ్మినేని విడుదల నిబంధనలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని సూచించింది.
అమరావతి ప్రాంత మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ జరిగిన చర్చపై వివిధ వర్గాల ప్రజలు, ప్రాంతాల ప్రజలు పోలీసులకు పలు ఫిర్యాదులు చేశారు. రాజకీయ ప్రతీకారం, మీడియా విశ్లేషణ ముసుగులో వారిపై అవమానకరమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(Chief Minister N. Chandrababu Naidu) గతంలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజధానిపై దురుద్దేశపూరిత కుట్రలో భాగంగా మహిళల మనోభావాలను దెబ్బతీయడంలో అన్ని హద్దులు దాటిన వారందరూ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.