నర్స్ అనుమానాస్పద మృతి
- శరీరంపై తీవ్ర గాయాలు
- హత్యగా బంధువుల అనుమానం
- దర్యాప్తు చేపట్టిన తుక్కుగూడ పోలీసులు
మహేశ్వరం/తుక్కుగూడ, ఆగస్టు 29(విజయక్రాంతి): తుక్కుగూడలో నర్సుగా పనిచేస్తున్న శిరీష అనే యువతి తన నివాసంలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా.. ఇది హత్యేనని ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వివరాల ప్రకారం.. శిరీష పనిచేస్తున్న చోటు నుంచి సమాచారం లేకపోవడంతో ఆమె స్నేహితులు, బంధువులు అనుమానంతో గది వద్దకు వచ్చారు.
ఇంటి కిటికీ తెరిచి చూడగా లోపల శిరీష మృతదేహం కనిపించింది. ఘటనా స్థలంలో రక్తం మరకలు ఉండటంతో పాటు, శిరీష శరీరంపై తీవ్రంగా కొట్టినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఆమె పిన్ని లవకుశ తెలిపింది.
ఎవరో కావాలనే ఈ దారుణానికి ఒడిగట్టారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






