19-07-2025 02:05:06 AM
- కల్యాణమస్తు చెక్కులు నివాసాల్లో కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పంపిణీ చేయాలి
- సనత్ నగర్ మహిళా కాంగ్రెస్
సనత్నగర్ జూలై 18 (విజయక్రాంతి):- సనత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ కార్యక్రమాలను తన ఇంట్లోనే నిర్వహిస్తూ ప్రోటోకాల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ స్థానిక మహిళా నాయకులు తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి అర్థిక సాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ కార్యాలయంలో కాకుండా లబ్ధిదారులను, ప్రభుత్వ అధికారులను తన ఇంటికి పిలిపించుకొని పంపిణీ చేస్తూ ప్రోటోకాల్ ను బ్రేక్ చేస్తున్నారని అన్నారు.
చెక్కుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి పేరు కాకుండా మాజీ సీఎం కెసిఆర్ పేరు చెప్తూ లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కొరకు ఖర్చు చేస్తున్న నిధులను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా కెసిఆర్ పేరు చెప్పి పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాలి కానీ సొంత డబ్బులు ఇచ్చినట్టు ఇంట్లో చేయడం ఏంటని అన్నారు.
ఇకనైనా తన తీరు మార్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కమర్ హమీద్, సనత్ నగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు అశ్విని, అమీర్పేట్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ రాజరా జేశ్వరి, బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ పద్మావతి, ప్రధాన కార్యదర్శులు విజయలక్ష్మి, అనిత గుప్తా, అండాలు తదితరులు పాల్గొన్నారు.