31-05-2025 12:36:48 AM
- బడిలో అదనంగా టీచర్లు.. తక్కువ టీచర్లున్న స్కూల్లో బోధన
- కలెక్టర్లకు అధికారమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు
- జూన్ 13లోపు ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశం
హైదరాబాద్, మే 30 (విజయక్రాం): మరికొద్దిరోజుల్లో విద్యాసంవత్సరం ప్రారం భం కానున్న నేపథ్యంలో సర్కార్ బడుల్లో అవసరమైన చోట ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే శుక్రవారం జిల్లాల పరిధిలో ఉపాధ్యాయుల సర్దుబాట్లకు కలెక్టర్లకు ఫుల్ పవర్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కలెక్టర్ నేతృత్వంలో విద్యాశాఖ అధికారులు పలు స్కూళ్లలో అదనంగా ఉన్న టీచర్లను వెంటనే గుర్తించనున్నారు. వారిని టీచర్లు అవసరం ఉన్న స్కూళ్లల్లో సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కువ మందిని ఆయా జిల్లాల్లోనే సర్దుబాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఇవ్వకుండా సర్కార్ జాగ్రత్త వహిస్తున్నది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారిని సైతం అక్కడే సర్దుబాటు చేస్తున్నది. అదే సమయంలో నాన్ ఏజెన్సీ టీచర్లను ఏజెన్సీ ప్రాంతాల్లో సర్దుబాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. సర్దుబాట్లకు క్యాడర్ ప్రకారం జూనియర్లకు ప్రయారిటీ ఉంటుంది. సర్దుబాటుకు వెళ్లిన టీచర్లంతా వచ్చే నెల 13 లోపు ఆయా స్కూళ్లలో రిపోర్ట్ చేయాల్సి ఉంది.
ఎన్రోల్మెంట్ పెంచమంటూ టీచర్లను తొలగిస్తారా?
‘ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలి. విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచాలి’ అని సర్కార్ ఆదేశాలిస్తూ.. సర్దుబాటు పేరిట ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేకుండా చేయడం దారుణమని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్రోల్మెంట్ పెంపు కోసం త్వరలో బడిబాట ప్రారంభం కానున్నదని, ఇలాంటి సందర్భంలో ఒక స్కూల్లో ఉన్న టీచర్లను, సర్దుబాటు పేరుతో వేరే స్కూళ్లకు పంపిస్తే తల్లిదండ్రులు ఇక తమ పిల్లలను ఎలా ప్రభుత్వ బడులకు పంపిస్తారని ప్రశ్నిస్తున్నది. పాఠశాలలు ప్రారంభం కాకుండా, ఎన్రోల్మెంట్ను పట్టించుకోకుండా జూన్ 13 నాటికే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదంటున్నది.