30-06-2025 02:12:47 AM
నిజామాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ప్రతీ సంక్షేమ పథకంలోనూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయినా అవినీతి పోలేదని, బీఆర్ ఎస్ కంటే భారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని హెచ్చరించారు.
ఆదివారం నిజామా బాద్లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు.. లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులు, మహిళలు, ఆదివాసీలు, యువకులు, వెనుకబడిన తరగతు లకు న్యాయం జరగాలన్నా, మోదీ ప్రభు త్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందాలన్నా డబుల్ ఇంజిన్ సర్కార్తోనే సాధ్యమన్నారు.
2014లో దేశ ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశ రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్కు తగిన బుద్ధిచెప్పామన్నారు. నాలుగు దశాబ్దాలుగా నక్సలైట్లు తెలంగాణలో 40 వేలకు పైగా ఆదివాసీలను హతమార్చారన్నారు. 31 మార్చి 2026 లోపు నక్సలైట్లు ఆయుధాలను వదిలి జనజీవనస్రవంతిలో కలవాలన్నారు. లేదంటే పూర్తిగా తుడిచిపెడతామని హెచ్చరించారు. నక్సల్స్ తో చర్చలు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోందని, ఆయుధాలు చేతబట్టిన వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిస్తేనే వారిని ఆదరిస్తామన్నారు. పదివేలకు పైగా నక్సలైట్లు లొంగిపోయి వివిధ రాజకీయ పార్టీల్లో చేరి, ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రతినిధులుగా ప్రశాంత జీవితం గడుపుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లకు సహకరిస్తుందేమోనన్న భయం తనకు ఉందని, కానీ కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ నక్సలైట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు.
తెలంగాణ ప్రజలు రేవంత్రెడ్డికి అధికారం కట్టబెట్టారని రాష్ట్రాన్ని నక్సలైట్ల అడ్డాగా మార్చవద్దని అమిత్షా హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ ద్వారానే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయలను రైతుల సంక్షేమానికి అదనంగా కేటాయింపులు చేశారని తెలిపారు. రైతులకు కిసాన్ బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు ఆయన చెప్పారు.
అంతర్జాతీయ స్థాయికి ఇందూరు పసుపు ఖ్యాతి..
తెలంగాణ పసుపు రైతుల 40 ఏండ్ల్ల కలను మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్లో ఆదివారం పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. తెలంగాణలో పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీ అర్వింద్తో పాటు కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర నేతలు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, లక్ష్మణ్ తదితరులు ఎంతో ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు.
ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ప్రధానమంత్రి మోదీ పసుపు బోర్డు నిజామాబాద్కు ఇచ్చారని, అలాగే నిజామాబాద్ జిల్లాకే చెందిన రైతు పల్లె గంగారెడ్డిని చైర్మన్గా నియమించారన్నారు. ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు మంజూరు చేయడమే కాకుండా అనుబంధ వాణిజ్య ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడంతోపాటు పరిశోధన కేంద్రాలను కూడా నెలకొల్పనున్నట్టు తెలిపారు. పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా నెలకొల్పడంపై ప్రధానమంత్రి మోదీకి రైతులు కృతజ్ఞతలు తెలపాల్సిందిగా అమిత్ షా కోరగా..
సభకు హాజరైన రైతులు సంతోషంగా కొట్టిన చప్పట్లతో సభాప్రాంగణం మారుమోగింది. ఒకటి రెండు సంవత్సరాల్లో పసుపు బోర్డు తన కార్యకలాపాలను విస్తృతం చేసి ప్రపంచస్థాయిలో పసుపు పంట వాణిజ్యాన్ని కొనసాగిస్తుందన్నారు. ఈ సందర్భంగా రైతులకు అదనంగా 6 నుంచి 7 వేల రూపాయల లాభం కలిగే విధంగా పసుపు బోర్డు పనిచేస్తుందన్నారు. నిజామాబాద్ పసుపు రాజధానిలా మారాలని అమిత్ షా ఆకాంక్షించారు. మూడు, నాలుగు సంవత్సరాల్లోనే నిజామాబాద్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందని చెప్పారు.
ఆర్గానిక్ పసుపు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్కు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ప్రపంచంలో పసుపునకు డిమాండ్ ఉన్న దృష్ట్యా అందులో ఉండే ఔషధ గుణాలపై బోర్డు విస్తృత ప్రచారం నిర్వహిస్తుందన్నారు. పసుపు ప్రొడక్షన్, ప్యాకేజింగ్, ఎక్స్పోర్ట్స్ తదితర అంశాలపై పసుపు బోర్డు ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు. భారత్ ఆర్గానిక్ కార్పొరేషన్, ఎక్స్పోర్ట్ కార్పొరేషన్లను కూడా ఇందూరులో ఏర్పాటు చేసి కొనుగోలు, రవాణా, ఎగుమతి పసుపు బోర్డు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం రైతుల ఆకాంక్షలను గుర్తించి బోర్డును మంజూరు చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. కేంద్రంతో తాము పసుపు బోర్డు విషయంలో సమన్వయంతో పని చేస్తామన్నారు. ప్రధాని మోదీతో పాటు అమిత్షాను పలుమార్లు కలిసి బోర్డు తీసుకురావడానికి కృషి చేసిన అర్వింద్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
మాజీమంత్రి డీ శ్రీనివాస్ విగ్రహావిష్కరణ
నిజామాబాద్ నగరంలోని ఘంటసాల బైపాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీమంత్రి, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆదివారం ఆవిష్కరించారు. డీ శ్రీనివాస్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ విగ్రమాన్ని దాదాపు రూ.48 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయించారు.
కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.