తెలంగాణ జాగృతి కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ(Telangana Formation Day) దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్లోని కొత్త జాగృతి కార్యాలయంలో(Telangana Jagruthi Office) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత జాతీయ, తెలంగాణ జాగృతి జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం(Telangana movement)లో పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు ఆమె నివాళులు అర్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “జై తెలంగాణ” నినాదాన్ని కూడా ఎత్తడంలో విఫలమయ్యారని విమర్శించారు.
స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao) ఉద్యమస్ఫూర్తితో పోరాడిన సకల జనులు, అన్ని వర్గాలకు ఉద్యమాభివందనాలు తెలిపారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ... పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధిలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని కోరుకుందామని పేర్కొన్నారు. "తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండా మరియు తెలంగాణ జాగృతి జెండాను ఆవిష్కరించడం జరిగింది.'' అని కవిత ఎక్స్ లో పేర్కొన్నారు.






