09-08-2025 01:11:47 AM
హైదరాబాద్/సంగారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): తెలంగాణను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగ ణంలో రూ.347 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈహెచ్వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీఆర్జీవో కోర్ ప్రాసెసింగ్ సెంట ర్, సర్జ్ అరెస్టేర్ యూనిట్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ అనతికాలంలోనే తయారీ రంగంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ మారిందన్నారు. 2024--25లో ఇండస్ట్రియల్ అవుట్పుట్ రూ.2.77 లక్షల కోట్లు అని, ఇందులో 48 శాతం వాటా తయారీ రంగానిదేనని అన్నారు. 9 నెలల్లోనే రూ.లక్ష కోట్ల విలువైన మార్చండైజ్ ఎక్స్పోర్ట్స్ రాష్ర్టం నుంచి జరిగాయని, జీఎస్డీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా.. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అని వివరించారు.
2040 నాటికి విద్యుత్ డిమాండ్ రెట్టింపు
2040 నాటికి దేశీయ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని ఆర్థిక సర్వే(2024-25) లెక్క తేల్చిందని, ఈ డిమాండ్ ను అందిపుచ్చుకొని రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణను రెన్యువబుల్స్ ఇంజిన్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే సంకల్పంతో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025ను తీసుకొచ్చినట్టు వివరించారు.
ఇప్పటికే క్లీన్ ఎనర్జీలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని, 2030 నాటికి న్యూ రెన్యువబుల్ కెపాసిటీని 20 వేల మెగా వాట్లకు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. బ్యాటరీలు, పవర్ కాంపోనెంట్స్, స్మార్ట్ గ్రిడ్స్ తదితర రంగాల్లో తోషిబా లాంటి దిగ్గజ సంస్థలను తెలంగాణకు ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ఎక్విప్మెంట్ జోన్లు ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు.
స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం తోషిబా తెలంగాణ ఆర్అండ్డీ హబ్కు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. క్లీన్ టెక్, సెమీ కండక్టర్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్లో పెట్టుబడులకు తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఈ వేదిక ద్వారా జపాన్ కంపెనీలను రాష్ర్ట ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నానని అన్నారు.
దుష్ర్పచారానికి ధీటైన సమాధానం తోషిబా
కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే అంతర్జాతీయ, జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని, కానీ కొందరు కావాలని పనిగట్టుకొని వాటిని ఉత్తుత్తి ఎంవోయూలు అంటూ తమపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ విమర్శలకు తోషిబా కంపెనీనే మీకు ధీటైన సమాధానం ఇస్తుందన్నారు.
ఈ ఏప్రిల్లో జపాన్ పర్యటనలో రూ. 562 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తోషిబా కంపెనీతో రాష్ర్ట ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందని, బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో ప్రస్తుతం రూ.177 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఈహెచ్వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించుకున్నామని వివరించారు. రూ.65 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీఆర్జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, రూ.105 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్ను ప్రారంభించుకున్నామని తెలిపారు.
ఈ పెట్టుబడులతో ఎనర్జీ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, జపాన్ ఎంబసీ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ మంత్రి క్యోకో హోకుగో, తోషిబా కార్పొరేషన్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ హిరోషి కనెటా, సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.