26-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, జూన్ 25: పదో తరగతి పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025---26 నుంచి ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరిలో తొలివిడత, మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో నిర్వహించే మొదటి విడత పరీక్షలను తప్పనిసరి చేయగా, మేలో నిర్వహించే రెండో విడత పరీక్షలను ఆప్షనల్గా పెట్టారు. కొత్త నిబంధనలకు తాజాగా సీబీఎస్ఈ ఆమోదం తెలిపింది.
మొదటి విడతలో నిర్వహించే పరీక్షల ఫలితాలను ఏప్రిల్లో, రెండో విడతలో నిర్వహించే పరీక్షల ఫలితాలను జూన్లో విడుదల చేస్తారు. విద్యార్థులపై పడుతున్న చదువుల భారాన్ని, పరీక్షల ఒత్తడిని తగ్గించేందుకు వీలుగా జాతీయ విద్యా విధానం - 2020 పలు కీలక సిఫార్సు చేసింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి, మే నెలల్లో రెండు విడుతల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ పరీక్షల విభాగాధిపతి భరద్వాజ్ వెల్లడించారు.
రెండు విడుతల్లో పరీక్షల నిర్వహణ వల్ల విద్యా ర్థులు మార్కులు మెరుగుపరుచుకొనే అవకాశం ఉంటుందన్నారు. అయితే అంతర్గత మదింపు ఏడాదికి ఒకేసారి ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్లలో మూడు సబ్జెక్టులను ఎంచుకొని బెటర్మెంట్ కోసం రాసుకోవచ్చని వెల్లడించారు.
చలికాలం ఎక్కువగా ఉండే స్కూళ్లలో ని పదో తరగతి విద్యార్థులకు ఏదో ఒక ఫేజ్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించా రు. కాగా పది పరీక్షలను రెండు దశల్లో నిర్వహించేందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను సీబీఎస్ఈ గతంలోనే వెలువరించింది. ఈ రెండు పరీక్షలను పూర్తిస్థాయి సిలబస్తోనే నిర్వహిస్తామని అందులో స్పష్టం చేసింది.