calender_icon.png 5 October, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు నెలల్లో ట్రిపుల్‌ఆర్‌కు టెండర్

05-10-2025 01:08:24 AM

  1. ఉత్తర భాగం రోడ్డు ప్రక్రియ ప్రారంభం
  2. మా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదు
  3. వారి అంగీకారంతోనే ముందుకు 
  4. సీఎంతో మాట్లాడి త్వరలో మంత్రుల కమిటీ వేస్తాం
  5. రోడ్లను అమ్ముకున్న పాపం బీఆర్‌ఎస్‌దే
  6. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

చిట్యాల, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని శనివారం రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా చిట్యాలలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..

2017 ప్రధాని మోదీ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డుకు అంగీకరిస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూ సేకరణ చేయకుండా నిర్లక్ష్యం వహించిందంటూ మండిపడ్డారు. తాను మంత్రి అయిన కొత్తలో 6శాతం భూసేకరణ మాత్రమే అయితే రైతులను ఒప్పించి ఇప్పుడు 98శాతం పైగా పూర్తి చేశామని చెప్పారు. 4లేన్ల ఆర్‌ఆర్‌ఆర్‌ను 2035 నాటికి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6లేన్లుగా మార్చుకున్నామని తెలిపారు.

సంగారెడ్డి నుండి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవపూర్ వయా భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.518కిలో మీటర్ల నార్త్ పార్ట్ ఉండనుందని, భూసేకరణ కోసం 6వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని కేంద్రం, రాష్ట్రం చెరిసగం వాటా ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 3వేల కోట్లు హడ్కో రుణం తెచ్చామని, ఇప్పటికే పలు మార్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశామని,

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం అయ్యామని పనులు వేగం చేసేలా మాట్లాడామని, ఉత్తర భాగం అలైన్మెంట్ లో ఎలాంటి మార్పు ఉండదని, జనవరిలో పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. అందుకు కేంద్రం సహకరించాలని కోరారు.

దక్షిణ భాగం విషయంలో ఆందోళన వద్దు

దక్షిణ భాగం విషయంలో రైతుల అనవసర ఆందోళన చెందొద్దని మంత్రి భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి అయిన తాను రైతుల అంగీకారంతోనే ముందుకు పోతామని తేల్చిచెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి మంత్రుల కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ, నిర్మాణం కోసం 45వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కట్టిన, ఇప్పుడు లక్షన్నర కోట్ల విలువ గల ఓఆర్‌ఆర్  ను 7వేల కోట్లకు అమ్ముకున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని,చరిత్రలో రోడ్లను అమ్ముకున్న పాపం బిఆర్‌ఎస్ ది మాత్రమేనని దుయ్యబట్టారు.

నితిన్ గడ్కరీ వ్యక్తిగతంగా తనను ఇష్టపడే వ్యక్తని తన పేరు చెప్పి గౌరెల్లి  భద్రాచలం హైవే, ఎల్బీనగర్  మల్కాపురం రోడ్డు జీవో ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్  విజయవాడ హైవే 8లేన్ల నిర్మాణ పనులు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభం అవుతాయని మరోమారు స్పష్టం చేశారు.