26-11-2025 12:28:37 AM
కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై విద్యార్థులు ఉద్యమించాలి
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి) : రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యాలు.. అరాచకాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. తన నివాసంలో పార్టీ విద్యార్థి విభాగం నాయకులతో జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ ప్రభుత్వం విద్యారంగానికి స్వర్ణయుగం తీసుకువచ్చారని, గురుకుల విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుతో లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారని గుర్తుచేశారు. గత పదేళ్లలో విద్యారంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి తెరతీసింది.
వారి అబద్ధాలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉంది’ అని ఆయన సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులను సమీకరించి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ భారీ నిరసన కార్యక్రమాలు చేప ట్టాలని సూచించారు.
గురుకులాల్లో కల్తీ ఆహారం మొదలుకొని, విద్యార్థుల ఆత్మహత్యల వరకు అనేక విషాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థి విభాగం చేపట్టిన ‘గురుకుల బాట’తో ప్రభుత్వంలో కొంత చలనం వచ్చినప్పటికీ, అది కేవలం కాంగ్రెస్ నాయకుల నటనగానే మిగిలిపోయిందన్నారు. గురుకులాల దుస్థితిపై మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగట్టాలి..
ప్రతి విద్యార్థికి సోషల్ మీడియా ఖాతా ఉండాలని, సమకాలీన రాజకీయాలపై యువత గట్టిగా స్పందించాలని కేటీఆర్ సూచించారు. ‘విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలి. ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా విద్యార్థి గొంతుక బలంగా వినిపించాలి’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేవలం స్ధానిక సంస్ధలకే కాదని, విద్యా, ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, ఈ అంశంపై యువతను జాగృతం చేయాలన్నారు.
బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తెలంగాణ చరిత్రలో దీక్షా దివాస్ (నవంబర్ 29) ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచిపోతుందని, డిసెంబర్ 9న దీక్షా దివాస్ జరుపుకుంటున్న ఆరోజే తెలంగాణ కేసీఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ సాధ్యమైందన్నారు. విద్యార్థులు విద్యార్థి అమరవీరుల త్యాగఫలం తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్పదన్నారు.
దీక్షా దివాస్ను ఘనంగా అన్ని యూనివర్సిటీలు అన్నీ కాలేజీల్లో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ కోసం చేసిన త్యాగాలను కేసీఆర్ గారి పాత్రను వివరించాల్సిన అవసరం ఉందని, యువకులకు ఉద్యమ కాలంలో జరిగిన త్యాగాల గురించి తెలియజేయవలసిన అవసరం ఉంది అన్నారు. తెలంగాణ రాష్ర్టంపై మనకున్న ప్రేమ ఇతరులకు ఉండదని, రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనదేనని కేటీఆర్ ఉద్ఘాటించారు.
అవినీతి కోసమే హెచ్ఐఎల్టీ పాలసీ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్కి తెర లేపిందని కేటీఆర్ అన్నారు. అందుకే 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేందుకు హెచ్ఐఎల్టీ పాలసీ తీసుకువచ్చిందని తెలిపారు. గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకి పారిశ్రామిక వ్యక్తులకు గత ప్రభుత్వాలు ఇచ్చాయని, అప్పటి మార్కెట్ రేట్కి సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను అందించినట్టు వివరించారు.
కానీ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న 20 పారిశ్రామిక వాడలలోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము గతంలో తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50 శాతం ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50 శాతం ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం దారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు.
మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లిస్తే చాలు అంటూ అప్పనంగా ఒకప్పటి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది కోట్ల రూపాయల భూములను అప్పనంగా చేస్తున్న ఈ భూముల దందా పైన వెంటనే ప్రజలను జాగ్రత్త పరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థి నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.