26-11-2025 12:28:52 AM
-పంచముఖ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హరీష్ రావు
-ఆలయానికి రూ. 1 లక్ష విరాళంగా అందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నవంబర్25:( విజయ క్రాంతి) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలోని శ్రీ శివ పంచాయతన పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో ఇటీవల శిఖర యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగగా మంగళవారం మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు పూర్ణకుంభంతో వాళ్లకి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దేవాలయానికి రూ.1 లక్ష విరాళంగా అందించారు. ఆలయ కమిటీ సభ్యులకు హరీష్ రావు చేతుల మీదుగా చెక్కును అందించారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామ శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసం కాగా, పరిశీలించడానికి వెళ్తూ మార్గమధ్యలో తుమ్మనపల్లిలో ఆగి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.