13-06-2025 02:34:23 AM
తరిగొప్పులలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
తరిగొప్పుల, జూన్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం శాశ్వతంగా భూ సమస్యలకు పరిష్కారం చూపనిందని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష అన్నారు. గురువారం తరిగొప్పుల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి భూ సమస్యకు స్థిరమైన పరిష్కారం అందించేందుకు రెవెన్యూ సదస్సులు గొప్ప వేదిక అవుతున్నాయన్నారు.
రైతులు వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. వచ్చిన దరఖాస్తులపై ఫీల్ పరిశీలన పూర్తయ్యాక వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, వారి సమస్యలను తెలుసుకొని, భూభారతి చట్టంలోని అంశాలను వివరించారు.
సదస్సులో రెవెన్యూ అధికారులు ప్రింటెడ్ దరఖాస్తు ప్రొఫార్మాలను అందజేశారు. హెల్ప్ డెస్క్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ రామారావు, ఆర్ ఐ ఆంధ్రయ, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.