01-06-2025 12:00:00 AM
హైదరాబాద్, మే ౩౧ (విజయక్రాంతి): వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాల ధరలు పెర గడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఒక వైపు విత్తనాలు, ఎరువులు ధరలు పెరగడం, మరో వైపు పచ్చిరొట్ట విత్తనాల ధరలు కూడా పెరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం అందించే సబ్సిడీని కూడా తగ్గించింది.
వ్యవయానికి సంబంధించి అన్ని రకాలు వస్తువులు ధరలు పెరగడం, చివరకు పంట చేతికొచ్చే సమయానికి మద్దతు ధర పలకపోవడంతో పాటు వివిధ రకాల తెగుళ్లతో పంట దిగుబడి తగ్గడం వల్ల రైతు చుట్టు అనేక కష్టాలు చుట్టుముడుతున్నాయి. భూమిని సారవంతం చేసి.. పంటల దిగుబడి పెంచుకోవడానికి దోహదం చేసే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాల ధరలు చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటలు సాగు చేసే ముందు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను రైతులు పొలాల్లో చల్లుతారు. ఆ విత్తనాలు ఏపుగా పెరగగానే పొలంలోనే కలియదున్ని, ఎరువుగా మార్చుకొని నేలను సాగుకు సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ ఏడాది పచ్చిరొట్ట విత్తనాల ధరలను ప్రభుత్వం మునుపెన్నడు లేని విధంగా భారీగా పెంచిందని రైతులు వాపోతున్నారు.
సబ్సిడీలోనూ 10 శాతం కోత
గత ఏడాది జీలుగ విత్తనాల ధర కిలోకు రూ. 93, జనుము విత్తనాల ధర కిలో రూ.90, పిల్లిపెసర కిలోకు రూ.135కు లభించాయి.ఈ విత్తనాల న్నింటికీ ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ అందించేది. 30 కిలోల జీలుగ విత్తనాల బ్యాగ్ రూ.2,790 ఉండగా, 60 శాతం సబ్సిడీతో రూ.1,116కే లభించేది. ఇక 40 కిలోల జనుము విత్తనాల సంచి రూ.3,620 ఉండగా, సబ్సిడీతో రూ.1,448కు దొరికేది.
20 కిలోల పిల్లిపెసర విత్తనాల సంచి ధర రూ.2,710 ఉండగా, సబ్సిడీతో రూ.1,084 లకు లభించేది. కానీ, ఈ ఏడాది జీలుగ విత్తనాల ధరను కిలోకు రూ.92 నుంచి రూ. 142.50 పెంచారు. అదే విధంగా జనుము విత్తనాల ధరను కిలోకు రూ.90 నుంచి 125.50, పిల్లిపెసర విత్తనాలు కిలోకు రూ.135 నుంచి రూ.205.50లకు పెంచారు.
సబ్సిడీలో నూ 10 శాతం కోత విధించారు. అంటే రైతులు గత సీజన్లో కొన్న ధరల కంటే ఇప్పుడు రెట్టింపు ధరను చెల్లించి పచ్చిరొట్ట విత్తనాలను రైతు కోనుగోలు చేయాల్సి ఉం టుంది. గత సీజన్లో 30 కిలోల జీలుగ విత్తనాల బ్యాగ్ ధర రూ.1,116 కు కొనుగోలు చేయగా, ఈ సీజన్లో రూ.2,127లకు లభిస్తుంది.
గతేడాది 40 కిలోల జనుము విత్తనాల సంచి రూ.1,448 ఉండ గా, ఇప్పుడు దాని ధర రూ.2510గా ఉంది. ఇక పిల్లిపెసర విత్తనాల 20 కిలోల సంచి గతంలో రూ.1084 ఉండగా, ఇప్పుడు రూ.2,050కు చేరింది.