16-06-2025 12:00:00 AM
ఏఐ వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్డి వలి ఉల్లా ఖాద్రి
కామారెడ్డి, జూన్ 15, (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నాయని ఏఐవై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్ డి వలి ఉల్లా ఖాద్రి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐ వైఎఫ్, ఏఐఎస్ఎఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు నిరుద్యోగ సమస్యలు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలో ,రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 10 ఏండ్లుగా బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి కోటి ఉద్యోగాలని చెప్పి ఇప్పటికీ భర్తీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకం పేరిట 16 లక్షల మంది యువకులకు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.
కామారెడ్డి జిల్లాలో నారాయణ, చైతన్య విద్యాసంస్థలు గుర్తింపు లేని సంస్థలు ఏర్పాటు చేసి విచ్చల విడిగా అనుమతి లేకుండా డబ్బులు ధ్యేయంగా లక్షల రూపాయల డొనేషన్ల పేరుతో, బుక్స్ పేరుతో డబ్బులను వసూలు చేస్తున్నారని అన్నారు. గుర్తింపు లేని పాఠశాలలను పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్నాయని అన్నారు. కామారెడ్డి డీఈవో కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతిగా ఎంఈఓ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కామారెడ్డి జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఉంటే టీచర్ లేకుండా నాణ్యతలేని ఆహారo అందించడం, సమయానికి ఉపాధ్యాయులు రాకపోవడం జరుగుతుంద న్నారు.
ఒక వైపు కార్పొరేట్ శక్తులు విద్యాసంస్థలు జిల్లా కేంద్రంతో పాటు డివిజన్ కేంద్రాల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తుంటే విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి గుర్తింపు లేని పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ ప్రవీణ్ ,ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శివప్రసాద్, మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దశరథ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.