ఆరోగ్యవంతమైన జీవన స్థితికి యోగా తోడ్పాటు
మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పరశయ్య
మంథని,మే 12(విజయ క్రాంతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంథనిలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక‘ విద్యా వారోత్సవాల రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పరశయ్య విద్యార్థులకు, అధ్యాపకులకు యోగ సాధన తరగతులను ప్రారంభిస్తూ ఆరోగ్యవంతమైన జీవనస్థితికి యోగా ఒక మంచి సాధనం అని తెలియజేశారు.
యోగా భారతీయ సంస్కృతి నుండి వచ్చిన గొప్ప వరం అని, ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు శాంతిని, ఆత్మకు శుద్ధిని ఇస్తుందని దీనివల్ల శరీర దృఢత్వం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి తోడ్పడుతుందని, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ యోగ చేయవచ్చునని ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మంచి సాధనంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు యోగాసనాలు సాధన చేశారు. తదనంతరం జరిగిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు కళాశాల అధ్యాపక బృందం పీజీ, బి.ఎడ్, ఐసెట్, లా సెట్ మొదలైన ప్రవేశ పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మల్లేపల్లి సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణ, పూర్వ విద్యార్థుల మండలి అధ్యక్షుడు కొండెల మారుతి, ఐక్యూఎసి కో ఆర్డినేటర్ కర్నాటి కృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్. లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్, అధ్యాపకులు అమర్నాథ్, ముకుందం, ఫర్జానా, రజిత, శేఖర్, దుర్గం కృష్ణ, బోధనేతర సిబ్బంది రాజు, సురేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






