చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి
భద్రాద్రి కొత్తగూడెం, (విజయశాంతి): చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించాలని రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.ఓ పక్క ఎస్ఐఆర్లో పేర్లు లేకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరగడం, మరోపక్క చేయూత వెబ్సైట్లో సర్వర్ సమస్యల కారణంగా అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వితంతువులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలు తదితర అర్హులకు చేయూత పెన్షన్ జీవనాధారంగా ఉందన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే సర్వర్ సమస్యలను పరిష్కరించడంతో పాటు దరఖాస్తుల గడువును మరో 10 రోజుల పాటు పొడిగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఎండీ యాకూబ్ పాషా కోరారు.






