17-06-2025 04:57:36 PM
వక్కవంతుల కోటేశ్వరరావు..
మునగాల: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరుతో మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని, మావోయిస్టు పేరుతో అనేకమంది ఆదివాసీలను, గిరిజనులను, అమాయకులను ఎన్కౌంటర్ పేరుతో అనేకమందిని చంపేస్తున్నారని ఇలాంటి పాశవిక చర్యలను ఆపాలని ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద శాంతి చర్చల కమిటీ మహా ధర్నాకు మునగాల మండలం నుండి బయలుదేరిన సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాల నాయకులు.
ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు మాట్లాడుతూ... ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యాన్ని ఖాళీ చేసి అక్కడ ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే మావోయిస్టులను చంపివేస్తున్నారని అన్నారు. భారతదేశంలో భాగమైన కర్రెగుట్టలలో భారతదేశ పౌరులను చంపి ప్రపంచ యుద్ధంలో గెలిచినట్లుగా, ఇతర దేశాలపై గెలిచినట్లుగా జాతీయ జెండాలను ఎగురవేయడం హేయమైన చర్య అన్నారు. మన దేశ రక్షణ దళాలు మన దేశ పౌరులపైనే యుద్ధం ప్రకటించడం ఇంతటి నీచమైన విధానాలను దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలన్నారు.
వెంటనే ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలను జరపాలని డిమాండ్ చేశారు. మతోన్మాద బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రశ్నిస్తున్న వారిపై హత్యాకాండకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధరవత్ రవి, ఐఎఫ్టియు జిల్లా సహయ కార్యదర్శి వి నరసింహారావు, కామల్ల శ్రీను, పిడిఎస్యు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కామల్ల ఉదయ్, పులి రాఖి, పి వై ఎల్ జిల్లా నాయకులు కామల్ల సుందరయ్య, పొన్నం బ్రహ్మం, అరుణోదయ డివిజన్ నాయకులు వట్టేపు కోటయ్య, దుగ్గి అనిల్, దాసరి వెంకటేశ్వర్లు, ఆదూరి విజయ్ తదితరులు పాల్గొన్నారు.