calender_icon.png 17 June, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలు పరిష్కారించాలని వినతి

17-06-2025 04:47:04 PM

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(Telangana Working Journalists Federation) సభ్యులు మంగళవారం కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏవో) రాజేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్, చింతకింది మధుసూదన్ మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులలో ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తుందని అన్నారు.

చాలీచాలని జీతాలతో కాలం వెళ్ళదిస్తున్న జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వ స్పందించి వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ కార్డులను స్టిక్కర్ల విధానంతో పునరుద్ధరించడం కాకుండా కొత్త కార్డులు మంజూరు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందజేయాలని కోరారు. కరోనా సమయంలో ఆపేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలన్నారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం త్వరలో సంఘం ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కోశాధికారి క్యాతం రాజేష్, ఉపాధ్యక్షులు గొర్రె లక్ష్మణ్, అరికెళ్ల జీవన్ బాబు, నాయకులు అహ్మద్, జర్నలిస్టులు పాల్గొన్నారు.