17-02-2026 12:00:00 AM
నూతనకల్, ఫిబ్రవరి 16: కన్నతల్లి, జన్మనిచ్చిన ఊరు రుణం తీరనిదని ప్రవాస భారతీయుడు డాక్టర్ మర్రి సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిల్పకుంట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో తాను బాల్యంలో విద్యనభ్యసించిన పాఠశాలకు మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సహాయం అందజేసి, ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు సొంత ఖర్చులతో బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సత్యనారాయణ రెడ్డిని గ్రామస్తులు శాలువాలతో, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజపల్లి నరసమ్మ, ట్రాఫిక్ సిఐ అంజపల్లి నాగమల్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నన్నేబోయిన సోమయ్య, గ్రామ పెద్దలు కందాల శంకర్ రెడ్డి, పెద్దింటి రంగారెడ్డి, బాణాల సుదర్శన్ రెడ్డి, పులుసు సత్యం, సామ సురేందర్ రెడ్డి, బొజ్జ శీను, ఎల్లావుల నరేష్ పాల్గొన్నారు.