05-12-2024 12:00:00 AM
దక్షిణ కొరియాలో మంగళవారం కొన్ని గంటల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఏకంగా అధ్యక్షుడికి పదవీ గండాన్ని తెచ్చిపెట్టాయి. ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మంగళవారం సాయం త్రం ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ను విధించడంతో ఈ పరిణామాలు మొదలయ్యాయి. అధ్యక్షుడి ప్రకటనతో సైన్యం రంగంలోకి దిగడంతో దీన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) ముందు నిరసనకు దిగారు.
అటు యూన్ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షం డెమోక్రటిక్ పార్టీతో పాటు సొంత పార్టీనుంచీ వ్యతిరేకత ఎదురైంది. అర్ధరాత్రి సమయంలో జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మార్షల్ లాను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడం, మార్షల్ లా అమలు చట్టవిరుద్ధమని స్పీకర్ ప్రకటించడం జరిగిపోయయి. దీంతో మార్షల్ లాను ఉపసంహరించుకుంటున్నట్లు యూన్ మరో ప్రకటన చేయాల్సి వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున అధికారికంగా మార్షల్ లాను ఎత్తివేశారు.
కొన్ని గంటల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు యూన్ పదవికే ఎసరు తెచ్చాయి. యూన్ తక్షణమే రాజీనామా చేయాలని, లేదంటే అభిశంసనను ఎదుర్కోవాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. మరోవైపు యూన్ పదవినుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. బుధవారం జరగాల్సిన తన అధికారిక షెడ్యూల్ను ఆయన రద్దు చేసుకోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఒక వేళ అభిశంసననుంచి అధ్యక్షుడు గట్టెక్కాలంటే పార్లమెంటులో మూడింట రెండువంతుల సభ్యుల మద్దతు అవసరం. దక్షిణ కొరియా పార్లమెంటులో 300 మంది సభ్యులున్నారు. అంటే 200 మంది సభ్యుల మద్దతు యూన్కు అవసరం. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ, ఇతర చిన్న విపక్ష పార్టీలకు కలిసి 192 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్షుడి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీసుకువచ్చిన తీర్మానం 1900 మెజారిటీతో నెగ్గింది.
అధ్యక్షుడి నిర్ణయంపై సొంతపార్టీనుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూన్ పదవినుంచి దిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి 1980 తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్ లాను విధించడం ఇదే మొదటి సారి. 1948లో కొరియా ద్వీపకల్పం ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయిన తర్వాత అనేక సందర్భాల్లో దక్షిణ కొరియా పాలకులు మార్షల్లాను విధించినప్పటికీ 1980 దశకం చివరినుంచి ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడం ప్రారంభమైంది.
నిజానికి 2022లో అధికారం చేపట్టినప్పటినుంచీ యూన్ రాజకీయం గా చిక్కులు ఎదుర్కొంటూనే ఉన్నారు. వాస్తవానికి ఆయన అత్యంత తక్కు వ మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి కూడా ఆయనపైన, ఆయన భార్య కిమ్పైన అనేక అవినీతి, రాజకీయ ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీ వ్యవహారాల్లో కిమ్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు న్నాయి. అంతేకాకుండా ఆమె లక్షల విలువైన హ్యాండ్బ్యాగ్ను కానుకగా స్వీకరించడం కూడా గతంలో తీవ్ర వివాదాస్పదం అయింది.
మరోవైపు జనంలో ఆయన పాపులారిటీ రోజురోజుకు దిగజారుతూ వస్తోంది. 2027లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి కావచ్చని భావిస్తున్న లీపై దర్యాప్తు జరపాలని యూన్ ఆదేశించడాన్ని సైతం ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు దేశం పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యల కారణంగా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ పరిణామాలన్నీ యూన్కు రాజకీయంగా చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. మరోవైపు తూర్పు ఆసియాలో తన మిత్రదేశమైన దక్షిణ కొరియాలో పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా సైతం ఆందోళన చెందుతోంది. దక్షిణ కొరియాలో రాజకీయ సుస్థిరత అమెరికాకు చాలా ముఖ్యం. మరి అగ్రరాజ్యం ఏం చేస్తుందో చూడాలి.